Monday, December 15, 2008

Bose Historical meet with Hitler

5 comments
బోసుకి ఎటువంటి మర్యాద ఇవ్వాలనే విషయంలో కూడా... మొదట్లో జర్మనీ అధికారుల్లో చాలా సందిగ్థత ఉండేది. ప్రచండ భానుడి వంటి వంటి బోసు వ్యక్తిత్వ ప్రభావానికి లోనుకాకుండా ఉండటం ఎంతటి వారికైనా కష్టమే. మాతృభూమికి వేలాది మైళ్ల దూరానికి, మరో ఖండానికి, భాష, కట్టుబాట్లు, సంప్రదాయాలు వేరుగా ఉండే ఒక పరాయి దేశానికి రిక్తహస్తాలతో చేరుకున్న మనిషి మాతృభూమి శృంఖలాలు తెంచేందుకు ఒక మహా విముక్తి సైన్యం నిర్మించే బృహద్యత్నంలో అనన్యసామాన్యమైన విజయాలు సాధించడం వెనుక... ఉన్న రహస్యమిదే .

మొదట బోస్, జర్మనీలో యావత్తు ఐరోపాలో నివసించే భారతీయులతో స్వతంత్ర భారత కేంద్రాన్ని స్థాపించాడు. నంబియార్, అబిద్ హసన్ , గిరిజా ముఖర్జీ, వ్యాస్, గాన్ ఫూలే, యన్.జి.స్వామి, యం.ఆర్. వ్యాస్ వంటి దేశభక్తులు ఎందరో...సుభాష్ బోస్ సహచరులుగా మారారు. బోసు స్థాపించిన కేంద్రానికి జర్మనీ రాయబార కార్యాలయ హోదా ఇచ్చి గౌరవించింది. కేంద్రం పనిచేసేందుకు గాను నెలనెలా జర్మనీ ప్రభుత్వం కొంత అప్పు ఇంచ్చేందుకు అంగీకరించింది. ఆ రుణాన్ని తీర్చే బాధ్యత సుభాష్ దే. బోస్ ప్రయత్నం ఫలించి, స్వతంత్ర భారత కేంద్రం భారత్ ను విముక్తి చేసిన అనంతరం ఈ రుణాల్ని తీర్చాల్సి ఉంటుంది. నిజానికి ఈ రుణాలను సుభాష్ సీరియస్ గానే తీసుకున్నాడు. కేంద్రం జమాఖర్చుల వివరాలను పక్కాగా నిర్వహించేవారు. అనంతర కాలంలో సుభాష్ జపాన్ వెళ్లినపుడు అక్కడి ప్రవాస భారతీయుల నుంచి వసూలు చేసిన విరాళాలనుంచి జర్మనీ రుణాన్ని తీర్చేందుకు కొంత ప్రయత్నం చేశాడు. 'స్వతంత్ర భారత కేంద్రం ' పేరు అలా లేకపోయినా, ఒక ప్రవాస ప్రభుత్వం తరహాలోనే పనిచేసేది.

కేంద్రం అధ్వర్యంలో త్వరలోనే రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రసారాలు 'ఆజాద్ హింద్ రేడియో ' , 'నేషనల్ కాంగ్రెస్ రేడియో ', 'ఆజాద్ ముస్లిం రేడియో ' పేర్లతో సాగేవి. 'ఆజాద్ హింద్ ' పేరిట 'జర్మనీ', 'ఇంగ్లీషు' భాషల్లో 5000 కాపీలతో మాసపత్రిక సైతం ప్రారంభమైంది. బోసు ఆశయ దీక్షకి ఆకర్షితులైన యువకులెందరో... తమ శక్తిని వెచ్చించి, రేడియో కేంద్రాన్ని, పత్రికని నడుపుతూ ఉండేవారు. ఆ కాలంలోనే బి.బి.సి లో హిందుస్థాని కార్యక్రమాలను అనువదింప చేసేందుకు జర్మనీ అధికారులు భారతీయ ఖైదీలను ఉపయోగించుకోవడం బోసు గమనించాడు. ఈ పని నిమిత్తం ఖైదీలను కాపలాతో రేడియో కేంద్రానికి తీసుకువచ్చి, మళ్లీ కాపలాతోనే క్యాంపుకి పంపేవారు. క్యాంపుల్లో దుర్భరమైన పరిస్థితుల్లో గడిపే ఖైదీలకు ఆ కొంచెం సేపు తెరిపిగా ఉండేది. వారు చేసిన సేవకిగాను, క్యాంపులో వారి పరిస్థితుల్లో కొంచెం వెసులుబాటు కూడా కల్పించేవారు. భారతీయ యుద్దఖైదీల దౌర్భాగ్య పరిస్థితులు బోసుని దుఃఖితుడిని చేశాయి. మాతృభూమి విముక్తి కోసం ఉపయోగపడాల్సిన భరత పుత్రుల ప్రతిభా సామర్ధ్యాలు, జీవితాలు దుర్భరమైన కాన్సంట్రేషన్ క్యాంపులో మగ్గి, అలమటించి కృశించి పోవడం బోసు మనసుని వికలం చేసింది.



వేలాదిగా ఉన్న ఈ యుద్దఖైదీలను మాతృదేశ విముక్తి సైన్యంగా మలచటానికి జర్మనీ అధికారుల్ని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. సుభాష్ బోస్ తలపెట్టిన ఈ కార్యానికి అనేక చిక్కులు ఉన్నాయి. భారతదేశంలో గ్రామ గ్రామాన, వీధి వీధినా స్వాతంత్ర్యపోరాట జ్వాలలు ఉధృతంగా వీస్తున్న సమయంలోనే, ఆ వేడిమికి చలించక బ్రిటిష్ ప్రభువుల ప్రయోజనాల పరిరక్షణకు మానసికంగా సిద్దపడి, పొట్టకూటికోసం సైనికులుగా ఆంగ్లేయుల కొలువులో చేరినవారు ఈ సైనికులు. విద్యాధికులతో, యోచనాపరులతో తమకి ఏ నాటికైనా ముప్పు తప్పదని అనుకున్నారో ఏమో... బ్రిటిష్ వారు సైన్యంలో చేర్చుకున్న భారతీయుల్లో నిరక్షరకుక్షులే అధికం. తెల్ల అధికారుల ఆదేశాలను గుడ్డిగా అమలు జరపడమే తప్ప స్వంత బుద్దితో ఆలోచించని బండతనం వారి శైలి. అసలు వారిని ఎంపిక చేసే సమయంలోనే బ్రిటిష్ అధికారులు ఈ ప్రమాణాలను పాటించేవారు. అటువంటి సైనికులు ఆ సమయంలో మాతృభూమికి, స్వంత కుటుంబాలకు వేలాది మైళ్ల దూరంలో, శత్రు శిబిరంలో యుద్దఖైదీలుగా దుర్భరమైన స్థితిలో ఉన్నారు .

అయినా వారిలో బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలనే దృఢ సంకల్పాన్ని ఎందరు ప్రదర్శిస్తారనేది అనుమానస్పదంగానే ఉండింది. ఈ కారణం వల్లనే బోసు ప్రతిపాదనలను జర్మన్ అధికారులు అనుమానంగానే చూశారు. అయితే యుద్దఖైదీల శిబిరాలను సుభాష్ చంద్ర బోస్ సందర్శించిన వెంటనే అందరి భయ సందేహాలు ఒక్కసారి పటాపంచలయ్యాయి. మట్టినుంచి జీవం ఉట్టిపడే వీరుల్ని తయారు చేయగల మాంత్రికుడు సుభాష్ అని స్పష్టమైంది. యుద్దఖైదీల్లో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్న నడివయసు వారు తమ హోదాలు, పెన్షన్లు, ప్రయోజనాలు దెబ్బతింటాయేమోనని తటపటాయించారు కానీ, యువకులైన సామాన్య సిపాయులు మాత్రం బోస్ కు బ్రహ్మరథం పట్టారు. 'ఇంక్విలాబ్ జిందాబాద్ ' 'సుభాష్ చంద్ర బోస్ కీ జై ' వంటి నినాదాలతో బ్యారక్స్ దద్దరిల్లి పోయేవి. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ అగ్రనేతగా సుభాష్ బోస్ పేరు వారందరికీ సుపరిచితమే . అయితే జర్మనీ గడ్డమీద ఆయన్ని దర్శించే భాగ్యం కలుగుతుందని వారెన్నడూ ఊహించలేదు. కారుచీకటి మధ్య కాంతిజలపాతంలా తమ దైన్య జీవితాలకు విముకుక్తినీ, పరమార్ధాన్ని కల్పించే దైవస్వరూపుడిగా వారు సుభాష్ ను ఆరాధించారు. బోస్ మాటలు వారిని వివశుల్ని చేశాయి. దేశ విముక్తికి సాయుధ సైన్య నిర్మాణం ప్రారంభమైంది.




జర్మన్ సైనిక నిపుణులనుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వయంగా బోసే కఠినమైన సైనిక శిక్షణ పొందాడు. యుద్దఖదీలతోను, స్వతంత్ర భారత కేంద్రంలో పనిచేసే దేశభక్తులతో, బోసు సందేశానికి ప్రభావితులై లొంగిపోయే బ్రిటిష్ భారతీయ సైనికులతో 'ఆజాద్ హింద్ ఫౌజ్' నిర్మాణం చకచకా సాగింది.

ప్రపంచ చరిత్రలోనే అత్యంత కౄరనియంతగా అవతరించిన హిట్లర్ తో సుభాష్ చంద్ర బోస్ చెలిమి చేసే ప్రయత్నం ఎందుకు చేశాడన్నది సమస్య.

నేతాజీ దృష్టిలో అత్యధిక ప్రాధాన్యం ఉండేది మన జాతీయ ప్రయోజనాలకే. శతృవు శతృవు మనకి మితృడని బోస్ నమ్మిన సూత్రం. మన శతృవు బ్రిటన్ మీదకి, హిట్లర్ యుద్దం ప్రకటించాడు కాబట్టి, శతృవు మెడలు వంచి, మనం స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు హిట్లర్ సాయం తీసుకుంటే తప్పేమీ లేదని బోస్ తర్కం. అసలు హిట్లర్ సాయమే తీసుకోవాలనే పట్టుదలేమీ బోస్ కి లేదు. కలకత్తా నుంచి బ్రిటన్ గూడచారుల, పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నపుడు బోస్ మొదట సోవియట్ సహాయం తీసుకోవాలనే ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యపడలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ లో ప్రవేశించాలని బోస్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాతే ఆయన జర్మనీ వైపు దృష్టి సారించాడు.



1942 మే 29 హిట్లర్ తో ముఖాముఖి సమావేశమైనపుడు జరిగిన సంఘటన బోస్ సాహసానికి పరాకాష్ట.


'మీ షరతుల ప్రకారం పనిచేయక పోతే నన్ను మీరు జైల్లో పెట్టగలమని బెదిరిస్తున్నారా?'

అంటో ఆ మహా నియంతకే మొహం మీద చెప్పగలిగిన నేతాజీ గురించి మరికొంత ముదు చూద్దాం.


Comments

5 comments to "Bose Historical meet with Hitler"

ప్రదీప్ said...
December 15, 2008 3:17 PM

Waiting for your next post.
Keep posting !

ప్రదీప్ said...
December 15, 2008 3:18 PM

Waiting for your next post.
Keep posting !

Manohar said...
December 15, 2008 7:03 PM

great compilation....

సురేష్ బాబు said...
December 15, 2008 8:43 PM

ఏమండీ,బోస్ గారిపై స్వామి వివేకానందుల ప్రభావము ఉన్నదని విన్నాను.ఇది నిజమేనా? సందేహమును తీర్చగలరు.

యోగి - The outcast said...
December 16, 2008 4:42 AM

వివేకానదుడు ప్రభావం ఒక్క బోసు గారి మీదనే కాదు, అరొబిందో ఘోష్ (అరవింద యోగి) మీద కూడా ఉంది. మచ్చుకు బోసుగారి మాటలు చదవండి.

I cannot write about Vivekananda without going into raptures. Few indeed could comprehend or fathom him even among those who had the privilege of becoming intimate with him. His personality was rich, profound and complex... Reckless in his sacrifice, unceasing in his activity, boundless in his love, profound and versatile in his wisdom, exuberant in his emotions, merciless in his attacks but yet simple as a child, he was a rare personality in this world of ours... Subhash Chandra Bose

Post a Comment

Blog Archive

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com