Monday, December 3, 2007

రాణుల వేటకు రాజు వెడలె-1

1 comments
నిజానికి అక్బర్ మహ కాముకుడు. తన కన్నుపడిన కాంతలను అంతఃపురంలోకి లాక్కొచ్చిపడేసేదాకా ఆయన విశ్రమించలేదు. తాను మరులుగొన్నది ఎవరి ఇల్లాలు అయినా అక్బర్ తటపటాయించేవాడు కాడు. యుక్తాయుక్తాల గురించి సంశయించే మనిషే అయితే సాటి ముస్లిం అయిన సుల్తాన్ బాజ్ బహాదూర్ చేపట్టిన కాంతను తాను పొందాలన్న తిమ్మిరిలో మాళవరాజ్యంపై విరుచుకుపడి వేల ప్రాణాలు తీసేవాడు కాడు.

అక్బర్ కామాగ్నిని ప్రజ్వరిల్లజేసిన ఆ మహిళ పేరు రూపమతి. పేరుకు తగ్గట్టు అందాల రాశి. ఆమెలాంటి స్వఛ్ఛమైన దివ్యస్త్రీని వేల సంవత్సరాలకొకసారి గానీ భగవంతుడు సృష్టించడనీ పల్లెల్లో పట్నాల్లో జానపదులు పాడుకునేవారు. ఆగ్రా వీధుల్లో మారువేషంతో తిరుగుతుండగా ఒక రోజున ఆ కీర్తిగానం అక్బర్ చెవిన పడింది. విన్నది మొదలుకుని అంతటి అలౌకిక సౌందర్యవతిని అనుభవించి తీరాలన్న ఆరాటం అతడి ఊపిరి సలపనివ్వలేదు. ఆ అందాల భరిణె ఎక్కడున్నా సగౌరవంగా తీసుకురండి. నా చేత గొప్ప సన్మానాలు పొందమని చెప్పండి - అని రాజోద్యోగులను పురమాయించాడు. రూపమతి మాళవ సుల్తాన్ బాజ్ బహదూర్ అంతఃపురంలో ఉన్నదని, చక్రవర్తి పిలిచినా సరే ఆమె రాదనీ వారు వట్టి చేతులతో తిరిగొచ్చి చెప్పేసరికి అక్బర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రూపమతిని మర్యాదగా తనకు స్వాధీనపరచకపోతే మాళవ రాజ్యాన్ని ముట్టడించయినా సరే ఆమెను లాక్కురావాలని తనకు సన్నిహితుడైన ఆధంఖాన్ కు ఉత్తర్వు జారీ చేశాడు.

బాజ్ బహాదూర్ విలాసపురుషుడు.రూపమతిని వలచి, వలపించుకుని తన రాణిని చేసుకున్నాడు. ప్రాణ సమానంగా చూసుకుంటున్న నెచ్చెలిని మొగలులు అడగగానే అర్పించుకోవడానికి అతడు సహజంగానే ఇచ్చగించలేదు. బాజ్ బహాదూర్ మొగలుల సవాలును వీరోచితంగానే స్వీకరించి సేనలను సన్నద్దం చేశాడు. ఒకవేళ తాము ఓడిపోతే మొగలుల చేతికి చిక్కకుండా అంతఃపుర స్త్రీలందరినీ చంపెయ్యమని నమ్మకస్తులైన వారిని నియోగించి అతడు యుద్దానికి కదిలాడు. సారంగపూర్ దగ్గర జరిగిన భీకర సమరంలో మాళవ సేనలు హోరాహోరీగా పోరాడినా అంతిమ విజయం మొగలులకే దక్కింది. బాజ్ బహాదూర్ చేసేదిలేక ఖాందేశ్ కొండల్లోకి పారిపోయాడు. పరాజయం కబురు తెలియగానే కోట సం రక్షకులు తమకు అప్పగించిన పనికి ఉపక్రమించారు. శత్రువులకు దక్కకుండా అంతఃపుర స్త్రీలను కత్తులతో నరికేస్తూ రూపమతీని వేటు వేశారు. ఆమె గాయపడింది కాని ప్రాణం పోలేదు. అంతటి సౌందర్యరాశిని చంపేందుకు చేతులు రాకో, తొందరలో గమనించకో గాని ఆమెను మళ్ళీ పిడిచి చంపలేదు. సేవకులు ఆమెను కోటలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంతలో వికటాట్టహాసంతో విరుచుకుపడ్డ ఆధంఖాన్ రూపమతి ఎక్కడున్నా వెతికి పట్టుకోమని సైనికులకు ఆదేశించాడు. ఆ సంగతి తెలిసి రూపమతి తానే విషం మింది అక్బర్ కు అందకుండా పరలోకానికి పోయింది. అప్పటి బీభత్స దృశ్యాన్ని అబుల్ ఫజల్ఇలా వర్ణించాడు.

The chief of them was Rupmati, renowned throughout the world for her beauty and charm. Baz Bahadur was deeply attached to her and used to pour out his heart in Hindi poems descriptive of his love. A monster who had been left in charge of her uplifted the sword and inflicted several wounds on her. Just then the army of fortune arrived and brought out that half-slaughtered lovely one. When Baz Bahadur had fled Adham Khan came in all haste and excitement to Sarangpur to seize the buried and other treasures… He took possession of all Baz Bahadur’s property… and sent people to search for Rupmati. When this strain reached her ear her faithful blood became aglow, and from love to Baz Bahadur she bravely quaffed the cup of deadly poison and carried her honour to the hidden chambers of annihilation! [The Akbarnama, Vol.II, translated by H. Beneridge p.213-14]

రూపమతి మరణవార్త విని అక్బర్ నివ్వెరపోయాడు. యుద్దంలో గెలిచినా రాణి తనకు దక్కలేదన్న నిస్సహాయత కాస్తా ఆధంఖాన్ పట్ల ఆగ్రహంగా మారింది.అక్కడ స్వాధీనమైన అపార సంపదలో, పాడే ఆడే సుందరాంగుల్లో తనకు పంపకుండా ఆధంఖాన్ ఏ మేరకు నొక్కేశాడోనన్న ఆదుర్దాతోనూ ఆరోగ్యం బాగా లేకపోయినా అక్బర్ 1561 ఏప్రిల్ 27న హుటిహుటిన సారంగపూర్ వెళ్ళాడు. ఎక్కడా ఆగకుండా దట్టమైన అడవుల గుండా పదహారు రోజులు ప్రయాణం చేసి సారంగపూర్ చేరీ చేరగానే రూపమతి చనిపోయిన గదికి వెళ్ళి చాలాసేపు మాడిన మొహంతో నిలబడ్డాడు.

Comments

1 comments to "రాణుల వేటకు రాజు వెడలె-1"

Anonymous said...
December 3, 2007 at 10:33 PM

అపురూప సౌందర్యరాశి ఐన ముస్లిము యువతిని తనకు బహుమతిగా ఇస్తే...ఆమెలో తల్లిని చూసిన శివాజి ఎక్కడ...ఈ అక్బర్ 'ది గ్రేట్' ఎక్కడ.

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com